వర్ధన్నపేట మండల సర్వసభ సమావేశం బహిష్కరణ
అధికారులు,ఎమ్మెల్యే వివక్ష చూపుతున్నారంటూ బీఆర్ఎస్,బీజేపీ ప్రజాప్రతినిధుల నిరసన
వర్ధన్నపేట, జులై 30,తరంగాలు : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల సర్వసభ సమావేశాన్ని గురువారం బీఆర్ఎస్, బీజేపీ ప్రజాప్రతినిధులు, పలువురు సర్పంచులు బహిష్కరించారు. తమ గ్రామాల అభివృద్ధి విషయంలో అధికారులు, స్థానిక ఎమ్మెల్యే సవతి తల్లి ప్రేమ చూపిస్తూ వివక్షకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు.
సమావేశాన్ని బహిష్కరించిన అనంతరం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించిన ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మండలంలోని అన్ని గ్రామాలకు సమాన ప్రాధాన్యత కల్పించి నిధులు కేటాయించాలని, అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, సంక్షేమ పథకాలను రాజకీయాలకు అతీతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
గ్రామాల మధ్య వివక్షకు తావులేకుండా పారదర్శక పాలన అందించాలని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అధికారులు వ్యవహరించాలని వారు కోరారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే భవిష్యత్తులో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.