కళాకారులకు పెద్దన్న... పేదలకు భరోసా ఈగ మల్లేశం
సేవా ప్రస్థానానికి ఘన సత్కారం..
ఈగ మల్లేశం - సంగీత దంపతులకు ‘స్వరాభిషేకం’ వేదికపై ఘన సన్మానం
కళా,సామాజిక,ప్రజాసేవకు గుర్తింపు
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి మధురస్మృతులలో నిర్వహించిన కార్యక్రమం
హనుమకొండ ప్రతినిధి, ఆగస్టు 1,తరంగాలు :
కళాకారుల సంక్షేమం, నిరుపేదలకు చేయూత, విద్యార్థులకు విద్యాసహాయం, సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజల మధ్య ప్రత్యేక గుర్తింపు పొందిన ఈగ మల్లేశం ఘన సన్మానం అందుకున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, గానకోకిల ఎస్. జానకి మధురస్మృతులను స్మరించుకుంటూ నిర్వహించిన “స్వరాభిషేకం” మహోత్సవ వేదికగా ఈ సత్కార కార్యక్రమం జరిగింది.ఈ సందర్బంగా ఈగ మల్లేశం- సంగీత దంపతులకు గజమాలతో ఘనంగా సన్మానం చేసి సన్మాన పత్రాన్ని అందజేశారు.
సేవను జీవిత ధ్యేయంగా మలచుకుని నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజాజీవితంలో కొనసాగుతున్న ఈగ మల్లేశం సేవా ప్రస్థానాన్ని నిర్వాహకులు ఈ సందర్భంగా కొనియాడారు. రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో ఆయన అందించిన సేవలను గుర్తుచేస్తూ ఘనంగా సత్కరించారు.
కళాకారుల సంక్షేమానికి అండగా..
ఉభయ తెలుగు రాష్ట్రాల కళాకారుల సంక్షేమ మండలి అధ్యక్షునిగా కళాకారుల సమస్యల పరిష్కారానికి, వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. మరుగునపడుతున్న జానపద కళారూపాలను, లిపిలేని కళారూపాలను కాపాడటంతో పాటు కళాకారులకు గుర్తింపు, ప్రోత్సాహం అందించేందుకు ఆయన కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
నటుడిగా నాటకాలలో నటించడంతో పాటు పలు చలనచిత్రాలకు రచయితగా, గాయకుడిగా కూడా కళారంగంతో తన అనుబంధాన్ని కొనసాగించారని గుర్తుచేశారు.
నిరుపేద కుటుంబాలకు చేయూత
వేలాది నిరుపేద యువజంటల వివాహాలకు ఆర్థిక సహాయం అందించడం, విద్యార్థులకు విద్యాసహాయం చేయడం, పేదలకు గృహనిర్మాణానికి సహకరించడం, ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం వంటి సేవా కార్యక్రమాలను నిర్వాహకులు ప్రస్తావించారు.
నిరుపేద కళాకారులకు ప్రోత్సాహం అందించడంతో పాటు ప్రభుత్వ పింఛన్లు అందేలా కృషి చేసినట్లు తెలిపారు.
కరోనా సమయంలోనూ సేవలు
కరోనా మహమ్మారి సమయంలో సురభి కళాకారులు, ఇతర కళాకారులు, నిరుపేదలకు ఆహారం, నిత్యావసర వస్తువులు, ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారని పేర్కొన్నారు. ఆపద సమయంలో అనేక కుటుంబాలకు ఆయన సేవలు భరోసా కల్పించాయని తెలిపారు.
పద్మశాలి సమాజ అభ్యున్నతికి కృషి
అఖిల భారత పద్మశాలి జాతీయ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తూ చేనేత కుటుంబాల సంక్షేమానికి కృషి చేస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. వివిధ ప్రాంతాల్లోని చేనేత కుటుంబాల సమస్యలను పరిష్కరించేందుకు, వలసలను తగ్గించేందుకు తనవంతుగా సహకరిస్తున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమంలోనూ కీలక పాత్ర
తెలంగాణ సాధన ఉద్యమ సమయంలో ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని పెంపొందించడంలో భాగంగా ‘దూంధాం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వారిలో ఈగ మల్లేశం కీలక పాత్ర పోషించారని నిర్వాహకులు తెలిపారు. రాష్ట్ర రాజకీయ పార్టీల యువజన సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) తొలి కన్వీనర్గా కూడా పనిచేశారని గుర్తుచేశారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో ప్రజాజీవితంలో కొనసాగుతూ, ఆలిండియా అభిమాన సంఘం గౌరవ అధ్యక్షునిగా సేవలందిస్తున్నారని తెలిపారు.
పదవిని సేవకు సాధనంగా మార్చుకున్నారంటూ ప్రశంసలు
కేంద్ర ఖాదీ, చిన్న పరిశ్రమల సంస్థ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహించి గ్రామీణాభివృద్ధి, కుటీర పరిశ్రమలు, స్వయం ఉపాధి రంగాలకు సేవలందించారని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల వారసుల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా కూడా సేవలందిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు.
“పదవులను అలంకరించడం కాదు.. పదవులకు ప్రజోపయోగ పరిమళాన్ని అద్దడమే ఈగ మల్లేశం సేవా తత్వం” అని నిర్వాహకులు కొనియాడారు.
“ఒక వ్యక్తిని కాదు.. ఒక సేవా తత్వాన్ని సత్కరిస్తున్నాం”
ఈగ మల్లేశం పేరు ఒక వ్యక్తి పేరు మాత్రమే కాదని, అది కళాకారులకు భరోసా, నిరుపేదలకు అండ, సమాజానికి సేవా సంప్రదాయానికి ప్రతీకగా నిలిచిందని నిర్వాహకులు పేర్కొన్నారు.
“కళాకారులకు అందించిన సహాయం కేవలం ఆర్థిక బలం కాదు.. వారి ఆత్మవిశ్వాసానికి అభయహస్తం. పేదలకు అందించిన చేయూత కేవలం దానం కాదు.. మానవత్వానికి చేసిన మహాయజ్ఞం” అంటూ ఆయన సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా ఈగ మల్లేశం సేవలను గుర్తిస్తూ “స్వరాభిషేకం” వేదికపై ఘనంగా సత్కరించి సన్మాన పత్రాన్ని అందజేశారు.
కళాసేవ రత్న అవార్డు గ్రహీత, కేంద్ర ఖాది,చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం మాట్లాడుతూ ఈ స్వరాభిషేక కార్యక్రమం మొదటగా మద్రాస్ లో దివంగత బాలసుబ్రహ్మణ్యం నిర్వహించినప్పుడు తనను ఎంపిక చేయడం జరిగిందన్నారు.అయితే అంత దూరం వెళ్లి అవార్డు తీసుకునే పరిస్థితిలో నేను లేకపోవడం వల్ల ఓరుగల్లు కళాకారులు ఆ అవార్డును ఎలాగైనా కలలకు పుట్టినిల్లు అయిన వరంగల్లో నిర్వహించి మా కళాకారుని సన్మానించుకుంటామని వారికి మాట ఇచ్చారని అన్నారు.వారి కోరిక మేరకు శనివారం నాకు ఈ సన్మానం చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. తన కుటుంబ కళాకారులకు చెందింది అని, కలల కోసం అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు.