భర్త హత్యకు భార్య కుట్ర..?
మరో వ్యక్తితో చాటింగ్..
‘ప్రమాదంలా’ మర్డర్ చేయాలనే ప్లాన్?
వాట్సాప్,ఇన్స్టాగ్రామ్ స్క్రీన్షాట్లతో పోలీసులను ఆశ్రయించిన భర్త
భార్య,మరో వ్యక్తిపై సంచల ఆరోపణలు
జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
ఖమ్మం, ఆగస్టు 7 (తరంగాలు ప్రతినిధి):
భార్య, ఆమెకు పరిచయం ఉన్న మరో వ్యక్తి కలిసి తనను హత్య చేయించేందుకు కుట్ర పన్నారని ఓ భర్త చేసిన ఆరోపణలు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో కలకలం రేపాయి. భార్య మొబైల్లో కనిపించిన వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ చాటింగ్ ఆధారంగా తనకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించాడు.
డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామానికి చెందిన గాదే రాజేశ్వరరావు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు. 2016లో వివాహం కాగా.. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత నెల 27న ఇంటికి వెళ్లిన సమయంలో తన భార్య మరో వ్యక్తితో చనువుగా ఉండటాన్ని గమనించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఈ విషయాన్ని కుటుంబ పెద్దల సమక్షంలో చర్చించేందుకు మరుసటి రోజు తన అన్నను తీసుకురావడానికి వెళ్లినట్లు తెలిపాడు. తిరిగి వస్తుండగా భార్యతో కనిపించిన వ్యక్తి తనను వెంబడించాడని, పట్టుకునే ప్రయత్నం చేయగా తప్పించుకుని వెళ్లిపోయాడని పేర్కొన్నాడు.
అనుమానం పెరగడంతో భార్య మొబైల్లోని సందేశాలను పరిశీలించగా.. తనను ఇంట్లో కాకుండా బయట ప్రమాదంలా కనిపించేలా హత్య చేయాలనే ఉద్దేశంతో భార్య, పురిమెట్ల సైదులు మధ్య చాటింగ్ జరిగినట్లు గుర్తించానని ఆరోపించాడు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ చాటింగ్ స్క్రీన్షాట్లను పోలీసులకు అందజేశాడు.
*జీరో ఎఫ్ఐఆర్.. దర్యాప్తు షురూ*
తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఈ నెల 1న డోర్నకల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును ఖమ్మం రూరల్ పోలీస్స్టేషన్కు బదిలీ చేశారు. తాజాగా బాధితుడు ఖమ్మం రూరల్ పోలీసులను కలిసి పూర్తి వివరాలు అందించాడు.
ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే భార్య, మరో వ్యక్తిపై చేసిన ఆరోపణలు నిజమా? కాదా? అనేది దర్యాప్తు పూర్తయిన తర్వాతే తేలుతుందని పోలీసులు స్పష్టం చేశారు.