కట్ర్యాలలో మరో చోరీ..
ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లగా దొంగల చేతివాటం
వర్ధన్నపేట ప్రతినిధి , ఆగస్టు 9, తరంగాలు : వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో మరో చోరీ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన చెంగల చంద్రమ్మ తన కుమార్తె ఇంటికి హైదరాబాద్ వెళ్లిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు.
ఇంట్లోని బీరువాను తెరిచి మూడు తులాల వెండి, ఒక తులం బంగారు చైన్ను అపహరించినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
ఇటీవల ఇల్లందలో జరిగిన చోరీ ఘటన మరువకముందే కట్ర్యాలలోనూ చోరీ జరగడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. రెండు ఘటనలకు ఒకే దొంగల ముఠా కారణమై ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ, ఇతర ఆధారాలను పరిశీలిస్తూ దొంగల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.