నర్సంపేటలో నిప్పులు చెరిగిన రాజకీయ వాతావరణం!
గద్దె కూల్చివేతతో బీఆర్ఎస్ గరం గరం!
“విగ్రహ ఆవిష్కరణను అడ్డుకోవడం దుర్మార్గం.. కుట్ర వెనుక కాంగ్రెస్ నాయకులు”
పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేతపై ఎర్రబెల్లి ఫైర్
“ఎన్ని అడ్డంకులొచ్చినా విగ్రహం ఆవిష్కరించి తీరుతాం” — ఎర్రబెల్లి దయాకర్రావు
నర్సంపేట, ఆగస్టు 10 (తరంగాలు ప్రతినిధి):
దివంగత మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహ ఆవిష్కరణ కోసం ఏర్పాటు చేసిన గద్దెను కూల్చివేయడం నర్సంపేటలో రాజకీయ దుమారం రేపింది. గద్దె కూల్చివేత ప్రదేశాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సందర్శించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అనంతరం నర్సంపేట పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.
ఇది దుర్మార్గపు చర్య
విగ్రహ ఆవిష్కరణను అడ్డుకోవడం దుర్మార్గపు చర్య అని ఎర్రబెల్లి అన్నారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి తీరుతామని స్పష్టం చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా గద్దెను కూల్చివేయడం ఏమిటని ప్రశ్నించారు.
కాంగ్రెస్పై ఎర్రబెల్లి ఆరోపణలు
గద్దె కూల్చివేత వెనుక కాంగ్రెస్ నాయకుల కుట్ర ఉందని ఎర్రబెల్లి ఆరోపించారు. నర్సంపేట పట్టణంలో గతంలో ఏర్పాటు చేసిన విగ్రహాల్లో ఎన్ని అనుమతులతో ఏర్పాటు చేశారో అధికారులు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
మరణంపైనా అనుమానాలంటూ సంచలన వ్యాఖ్యలు
తాజా పరిణామాలను చూస్తుంటే పెద్ది సుదర్శన్రెడ్డి మరణంపై కూడా తమకు అనుమానాలు కలుగుతున్నాయని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. ఆయనను మానసికంగా ఎంతగా ఇబ్బంది పెట్టారో ఈ పరిణామాలను బట్టి అర్థమవుతోందన్నారు. ఈ ఆరోపణలపై సంబంధిత వర్గాల స్పందన తెలియాల్సి ఉంది.
రెండు రోజుల డెడ్లైన్
పెద్ది సుదర్శన్రెడ్డి దశదిన కార్యక్రమం ఉన్నందున తాత్కాలికంగా ధర్నాను విరమించుకున్నామని ఎర్రబెల్లి తెలిపారు. రెండు రోజుల్లో గద్దె కూల్చిన వారిపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా, ఉమ్మడి వరంగల్ జిల్లా గ్రామగ్రామాన పెద్దఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు. గద్దె కూల్చివేతతో మొదలైన ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో అన్న ఉత్కంఠ నర్సంపేటలో నెలకొంది.