మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్కు తృటిలో తప్పిన ప్రమాదం
వెనుక నుంచి కారును ఢీకొట్టిన మరో వాహనం
మహబూబాబాద్, ఆగస్టు 13,తరంగాలు: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం శివారులో మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ప్రయాణిస్తున్న కారుకు గురువారం తృటిలో ప్రమాదం తప్పింది. రైస్మిల్లుకు వెళ్లే రహదారి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.స్థానికుల కథనం ప్రకారం.. మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ కారు వెళ్తున్న సమయంలో ముందుగా వెళ్తున్న ఓ ద్విచక్రవాహనం అకస్మాత్తుగా యూటర్న్ తీసుకుంది. అదే సమయంలో ఎదురుగా కూలీలు వస్తుండటంతో వారిని తప్పించేందుకు మాజీ ఎమ్మెల్యే కారు డ్రైవర్ వాహనాన్ని నెమ్మదించినట్లు తెలుస్తోంది.ఇదే సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న మరో కారు అదుపుతప్పి మాజీ ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారును వెనుక భాగంలో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే కారు వెనుక భాగం దెబ్బతిన్నది. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ప్రమాద సమాచారం తెలుసుకున్న అబ్బాయిపాలెం, ధారావత్ తండా గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకుని మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ను పరామర్శించారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.