🏠 tharangalu.com
Watermark
Newspaper Logo
tharangalu.com | Date: 16 Aug, 2026 | Page: 1

రాయపర్తి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి



అనుమానిత వ్యక్తులపై పోలీసులకు సమాచారం ఇవ్వాలి


రాయపర్తి ఎస్సై ముత్యం రాజేందర్


రాయపర్తి, ఆగస్టు 16,తరంగాలు : రాయపర్తి మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు అనుమానిత వ్యక్తుల సంచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని రాయపర్తి ఎస్సై ముత్యం రాజేందర్ సూచించారు. గ్యాస్ ఈ-కేవైసీ, కొత్త గ్యాస్ కనెక్షన్లు, ఆధార్ ఈ-కేవైసీ, రేషన్ కార్డు ఈ-కేవైసీతో పాటు ఉచిత గ్యాస్ కనెక్షన్లు, ఇంటి రుణాలు, పంట రుణాలు, సబ్సిడీ రుణాలు ఇప్పిస్తామని చెప్పి కొందరు కొత్త వ్యక్తులు గ్రామాల్లో సంచరిస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు సమాచారం అందుతోందని తెలిపారు.కొత్త గ్యాస్ కనెక్షన్ ఇప్పిస్తామని, ఫోటో అప్లోడ్ చేయాలని చెబుతూ మహిళలు మెడలో ధరించిన బంగారు ఆభరణాలను పక్కన పెట్టాలని సూచించి, వాటిని అపహరించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఫోన్ కాల్స్ ద్వారా ఫిర్యాదులు వస్తున్నాయని ఎస్సై పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తులను నమ్మి ఎలాంటి నగదు, బంగారు ఆభరణాలు, వ్యక్తిగత వివరాలు లేదా పత్రాలను వారికి అప్పగించవద్దని ప్రజలకు సూచించారు.

*ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలి*

గ్యాస్ ఈ-కేవైసీ, ఆధార్ ఈ-కేవైసీ, రేషన్ కార్డు ఈ-కేవైసీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, ఇంటి రుణాలు, పంట రుణాలు, సబ్సిడీ రుణాలు ఇప్పిస్తామని వచ్చే అపరిచిత వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించవద్దని కోరారు. అనుమానం కలిగించే వ్యక్తులు గ్రామాల్లో సంచరిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే రాయపర్తి పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ఎస్సై ముత్యం రాజేందర్ తెలిపారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో పాటు తమ కుటుంబ సభ్యులు, వృద్ధులు, మహిళలకు కూడా ఇలాంటి మోసాలపై అవగాహన కల్పించాలని పోలీసులు సూచించారు.
🏠 Home