ఆసుపత్రిలో సేవలపై కలెక్టర్ ఆరా!
మందుల నిల్వలు, టీకాల పంపిణీ, సిబ్బంది హాజరుపై ఆకస్మిక తనిఖీ
పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశం
రాయపర్తి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
రాయపర్తి , ఆగస్టు 26, తరంగాలు :
రాయపర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత, సిబ్బంది పనితీరు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను ఆమె పరిశీలించారు. పల్లె దవాఖానాలో చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్న తీరును కలెక్టర్ పరిశీలించారు. టీకాల పంపిణీ ప్రక్రియ, చిన్నారులకు అందుతున్న వైద్య సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.అదేవిధంగా ఆసుపత్రిలోని మందుల నిల్వలను కలెక్టర్ తనిఖీ చేశారు. గడువు తీరిన మందులు నిల్వ ఉండకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, మందులను సురక్షితంగా భద్రపరిచేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.ల్యాబొరేటరీని పరిశీలించిన కలెక్టర్.. మందుల నిల్వలు, అందుబాటులో ఉన్న వైద్య సామగ్రి తదితర వివరాలను ల్యాబ్ ఇన్చార్జిని అడిగి తెలుసుకున్నారు. ల్యాబొరేటరీని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.
ఆరోగ్య కేంద్రానికి వివిధ సమస్యలతో వచ్చిన రోగులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి, ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది స్పందన, అందుబాటులో ఉన్న మందులు, సౌకర్యాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ఆరోగ్య కేంద్రం పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా వైద్యులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని డాక్టర్ సత్య శారద సూచించారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రతి రోగికి మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ ఆకస్మిక తనిఖీలో డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ ప్రకాష్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరుణ్, సంబంధిత గ్రామ సర్పంచ్ తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.