🏠 tharangalu.com
Watermark
Newspaper Logo
tharangalu.com | Date: 26 Aug, 2026 | Page: 1

కోడెల సంరక్షణలో నిర్లక్ష్యానికి తావులేదు

గోశాలను సందర్శించిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

వేములవాడ, ఆగస్టు 26,తరంగాలు ప్రతినిధి : రాజన్న ఆలయానికి భక్తులు సమర్పించే కోడెలు, ఆవుల సంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు.ఇటీవల గోశాలలో ఐదు కోడెలు మృతి చెందిన ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించామని, మానవ తప్పిదం లేదా అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కొత్తగా వచ్చే కోడెలను 15 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచి, వయసు ఆధారంగా గ్రేడింగ్ చేయడంతో పాటు చిన్న, పెద్ద కోడెలను వేర్వేరుగా సంరక్షించాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో పరిశుభ్రత, పశుగ్రాసం, వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వేములవాడలో ఆధునిక సౌకర్యాలతో నూతన గోశాల నిర్మాణానికి 40 ఎకరాల స్థలం సేకరించి, క్యాబినెట్ ఆమోదం పొందినట్లు తెలిపారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించి నూతన గోశాలను అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు.భక్తుల విశ్వాసం, మనోభావాలను గౌరవిస్తూ రాజన్నకు సమర్పించే ప్రతి కోడెను బాధ్యతగా సంరక్షించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
🏠 Home