ఒక్కరోజు ఉపాధ్యాయురాలిగా కలెక్టర్ సత్య శారద
విద్యార్థినులతో మమేకమైన కలెక్టర్
కలెక్టర్ చేతిలో చాక్పీస్.. తరగతి గదిలో సందడి!
లోహిత పాఠశాలలో విద్యార్థినులకు స్వయంగా పాఠాలు చెప్పిన సత్య శారద
వరంగల్ ప్రతినిధి , సెప్టెంబర్ 3, తరంగాలు: వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఒక్కరోజు ఉపాధ్యాయురాలిగా మారారు. దింతో తరగతి గదిలో సందడి నెలకొంది.
విద్యార్థుల అభ్యాస స్థాయిని తెలుసుకోవడంతో పాటు వారిలో చదువుపై ఆసక్తిని పెంపొందించేందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గురువారం సంగెం మండలం లోహిత గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో ఆత్మీయంగా మమేకమైన కలెక్టర్.. ఒక్కరోజు ఉపాధ్యాయురాలిగా మారి స్వయంగా తరగతి గదిలో పాఠాలు బోధించారు.
తరగతి గదిలో విద్యార్థినులతో కలిసి కూర్చున్న కలెక్టర్ వారి చదువు తీరును పరిశీలించారు. పలు అంశాలను సులభమైన రీతిలో వివరిస్తూ విద్యాబోధన చేశారు. విద్యార్థినులను ప్రశ్నలు అడిగి వారి అభ్యాస సామర్థ్యాన్ని తెలుసుకున్నారు. పిల్లలు చెప్పిన సమాధానాలను ఆసక్తిగా వింటూ, సరైన సమాధానాలు చెప్పిన వారిని అభినందించి మరింత ఉత్సాహపరిచారు.
చదువుతో పాటు క్రమశిక్షణ, పరిశుభ్రత, మంచి అలవాట్లు ఎంతో అవసరమని కలెక్టర్ విద్యార్థినులకు సూచించారు. ప్రతిరోజూ పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరై, ఉపాధ్యాయులు బోధించే పాఠాలను శ్రద్ధగా వినాలని తెలిపారు. విద్యే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునేందుకు బలమైన పునాది అని పేర్కొంటూ.. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దానిని సాధించే దిశగా కష్టపడి చదవాలని సూచించారు.
పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడంతో పాటు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం అత్యంత ముఖ్యమని కలెక్టర్ అన్నారు. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, వారిని ప్రోత్సహించడంలో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
కలెక్టర్ స్వయంగా తరగతి గదిలో విద్యార్థినులతో కలిసి కూర్చొని పాఠాలు బోధించడంతో పాఠశాలలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. విద్యార్థినులు కలెక్టర్తో ఆత్మీయంగా మాట్లాడి, ఆమె బోధనను ఆసక్తిగా విన్నారు. కలెక్టర్ ఒక్కరోజు ఉపాధ్యాయురాలిగా మారడం విద్యార్థినుల్లో చదువుపై మరింత ఆసక్తి, ఉత్సాహాన్ని నింపింది.
ఈ కార్యక్రమంలో డీబీసీడీఓ పుష్పలత, ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్ రావు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.