🏠 tharangalu.com
Watermark
Newspaper Logo
tharangalu.com | Date: 07 Sep, 2026 | Page: 1

పద్మశాలీల భవిష్యత్‌కు "ఐక్యతే ఆయుధం"

చేనేత కుటుంబాల హక్కుల కోసం సమష్టి పోరాటం అవసరం

పద్మశాలీలు ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో ఎదగాలంటే ఐక్యంగా ముందుకు సాగాలి

పద్మశాలీల అభ్యున్నతికి ఎల్లవేళలా అండగా ఉంటా

కేంద్ర ఖాదీ,చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం

హన్మకొండ ప్రతినిధి , సెప్టెంబర్ 6, తరంగాలు : పద్మశాలి సమాజం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మరింత అభివృద్ధి చెందాలంటే కుల ఐక్యత ఎంతో అవసరమని కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం అన్నారు. హన్మకొండ పట్టణం భీమారంలోని ఎస్వీఎస్ క్యాంపస్‌లో స్వరాజ్ న్యూస్, నేతన్న టీవీ సంయుక్తంగా నిర్వహించిన నేతన్న టీవీ అవార్డ్స్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఈగ మల్లేశం మాట్లాడుతూ..పద్మశాలీల భవిష్యత్‌కు ఐక్యతే బలమైన ఆయుధం అని అన్నారు. పద్మశాలీల సంప్రదాయ వృత్తి అయిన చేనేత రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు, రాయితీలు సకాలంలో అందేలా సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పద్మశాలి సమాజ సంక్షేమంతో పాటు చేనేత, అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల హక్కుల పరిరక్షణకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.
విశిష్ట ప్రతిభకు నేతన్న టీవీ అవార్డులు
నేతన్న టీవీ ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పద్మశాలి సమాజంలో వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన పలువురికి ఈగ మల్లేశం చేతుల మీదుగా ప్రతిష్టాత్మక అవార్డులను అందజేశారు. సమాజంలోని ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహిస్తున్న నేతన్న టీవీ ఎండీ రాజేందర్, సీఈఓ స్వాతి, యాజమాన్యాన్ని ఈగ మల్లేశం అభినందించారు.
అనంతరం నేతన్న టీవీ యాజమాన్యం తరఫున ఈగ మల్లేశంను శాలువా, మెమంటోతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో పద్మశాలి సమాజ ప్రతినిధులు, నేతన్న టీవీ సిబ్బంది, వివిధ రంగాలకు చెందిన అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు.
🏠 Home