అర్ధరాత్రి ఆపన్నహస్తం.. డెంగ్యూ బాధిత బాలుడికి ఎమ్మెల్యే భరోసా
సోషల్ మీడియా పోస్టులు చూసి వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు
రాత్రి 10:50 గంటలకు స్వయంగా ఫోన్.. చికిత్సకు అండగా ఉంటామని హామీ
వర్ధన్నపేట ప్రతినిధి, సెప్టెంబర్ 16,తరంగాలు : ఆపదలో ఉన్న ఓ కుటుంబానికి అర్ధరాత్రి వేళ ఎమ్మెల్యే స్వయంగా ఫోన్ చేసి భరోసా కల్పించారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన 11 ఏళ్ల మంద కార్తీక్ కొన్నిరోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ అత్యవసర చికిత్స పొందుతున్నాడు. చికిత్స ఖర్చులను భరించేందుకు కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆర్థిక సహాయం కోరుతూ సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా చేసిన విజ్ఞప్తులు ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు దృష్టికి వెళ్లాయి.విషయం తెలుసుకున్న వెంటనే స్పందించిన ఎమ్మెల్యే.. సమయం కూడా చూడకుండా రాత్రి 10:50 గంటల సమయంలో కార్తీక్ కుటుంబ సభ్యులకు స్వయంగా ఫోన్ చేశారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని, చికిత్సకు ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ కష్ట సమయంలో కుటుంబం ఒంటరిగా లేదని, కార్తీక్ చికిత్సకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు అన్ని విధాలా అండగా ఉంటానని ధైర్యం చెప్పారు.
చికిత్స ఖర్చుల విషయంలో ఆందోళన చెందవద్దని, అవసరమైన సహాయం కోసం త్వరలో ఎల్ఓసీ అందజేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. చిన్నారి ఆరోగ్యం గురించి ఆరా తీస్తూ, కార్తీక్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ఇంటికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ చిన్నారిని చూసుకుంటూ ఆందోళనలో ఉన్న కుటుంబానికి.. అర్ధరాత్రి ఎమ్మెల్యే నుంచి వచ్చిన ఫోన్ ఒకింత ధైర్యాన్ని నింపింది. ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలవడమే మానవత్వమనే భావనకు ఈ స్పందన నిదర్శనంగా నిలిచింది.
ఎమ్మెల్యే స్వయంగా ఫోన్ చేసి తమ కుటుంబానికి ధైర్యం చెప్పడంపై కార్తీక్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.